unfoldingWord 38 - యేసును పట్టుకున్నారు
Zarys: Matthew 26:14-56; Mark 14:10-50; Luke 22:1-53; John 18:1-11
Numer skryptu: 1238
Język: Telugu
Publiczność: General
Gatunek muzyczny: Bible Stories & Teac
Zamiar: Evangelism; Teaching
Cytat biblijny: Paraphrase
Status: Approved
Skrypty to podstawowe wytyczne dotyczące tłumaczenia i nagrywania na inne języki. Powinny być dostosowane w razie potrzeby, aby były zrozumiałe i odpowiednie dla każdej kultury i języka. Niektóre użyte terminy i pojęcia mogą wymagać dodatkowego wyjaśnienia, a nawet zostać zastąpione lub całkowicie pominięte.
Tekst skryptu
ప్రతీ సంవత్సరం యూదులు పస్కాపండుగను ఆచరిస్తారు. అనేక శతాబ్దాల క్రితం తమ పితరులను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించిన దానిని బట్టి చేసే పండుగ. యేసు బహిరంగ బోధ ప్రారంభించిన మూడు సంవత్సరాలకు యేసు తన శిష్యులతో తాను యెరూషలెంలో పస్కా పండుగ ఆచరించబోతున్నాడని చెప్పాడు. ఆయన అక్కడ చనిపోతున్నాడని వారితో చెప్పాడు.
యేసు శిష్యులలో యూదా అను ఒక శిష్యుడు, శిష్యుల డబ్బు సంచికి భాద్యత వహిస్తున్నాడు. అయితే తరచుగా అతడు ఆ డబ్బు సంచిలోనుండి దొంగిలిస్తూ ఉండేవాడు. యేసూ, ఆయన శిష్యులూ యెరూషలెంకు వచ్చిన తరువాత యూదా మతనాయకుల వద్దకు యూదా వెళ్ళాడు. తనకు డబ్బు ఇస్తే దానికి ప్రతిగా యేసును వారికి పట్టిస్తానని వారితో చెప్పాడు. యూదులు యేసును మెస్సీయగా అంగీకరించడం లేదని అతనికి తెలుసు. ఆయనను వారు చంపాలని ఎదురు చూస్తున్నట్టు అతనికి తెలుసు.
ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదా నాయకులు యేసును పట్టిస్తున్నందుకు యూదాకు ముప్పై వెండి నాణాలు ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుందని ప్రవక్తలు చెప్పిన విధంగా జరిగింది. యూదా అంగీకరించాడు. ఆ డబ్బును తీసుకొన్నాడు, వెళ్ళిపోయాడు. యేసును బంధించే అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు.
యెరూషలెంలో యేసు తన శిష్యులతో పస్కా పండుగ ఆచరిస్తున్నాడు. పస్కా విందు చేస్తున్న సమయంలో యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి ఈ విధంగా చెప్పాడు, “దీనిని తీసుకొని తినుడి. నేను మీకు అర్పిస్తున్న నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని తీసుకోండి.” ఈ విధంగా వారి కోసం తాను చనిపోతున్నట్టు వారికి చెప్పాడు. తన శరీరాన్ని వారికొరకు బలిగా అర్పించబోతున్నట్టు చెప్పాడు.
ఆ తరువాత ఆయన ఒక పాత్రను పట్టుకొని శిష్యులతో ఇలా చెప్పాడు, “దీనిలోనిది త్రాగండి, దేవుడు మీ పాపాలు క్షమించేలాగున మీకొరకు చిందింపబడుతున్న కొత్తనిబంధన రక్తం. దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనుటకై దీనిని చేయ్యుడి.”
అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు.” ఆ మాటకు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఎవరు అని ఆయనను అడిగారు. అందుకు యేసు ఇలా చెప్పాడు, “నేను ఎవనికి ఈ రొట్టె ముక్కను ఇవ్వబోతున్నానో అతడే నన్ను అప్పగిస్తున్నాడు.” ఆ రొట్టెను ఆయన యూదాకు ఇచ్చాడు.
యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొన్న తరువాత సాతాను వానిలోనికి ప్రవేశించాడు. యూదా ఆ చోటనుండి యేసును బంధించడంలో యూదా నాయకులకు సహాయం చెయ్యడానికి వెలుపలికి వెళ్ళాడు. అది రాత్రి సమయం.
భోజనం అయిన తరువాత యేసునూ, ఆయన శిష్యులునూ ఒలీవల కొండకు వెళ్ళారు. యేసు వారితో ఇలా చెప్పాడు, “ఈ రాత్రి మీరందరూ నన్ను విడిచిపెడతారు, “నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోవును” అని రాయబడియున్నదని వారితో చెప్పాడు.
పేతురు యేసుకు జవాబిస్తూ, “మిగిలిన అందరూ నిన్ను విడిచినా నేను నిన్ను విడువను!” అని చెప్పాడు. అప్పుడు పేతురుతో యేసు ఇలా అన్నాడు, “సాతాను మిమ్ములనందరినూ చెదరగొట్టాలని చూస్తున్నాడు, అయితే పేతురూ నీ విశ్వాసం తప్పిపోకుండునట్లు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, కోడి కూయకముందే నీవు నన్ను యెరుగనని మూడు సార్లు బొంకుతావు.”
పేతురు ప్రభువుతో ఇలా అన్నాడు. “నేను చావవలసి వచ్చినా నేను నిన్ను యెరుగనని చెప్పను!” మిగిలిన శిష్యులందరూ ఆ విధంగానే చెప్పారు.
అప్పుడు యేసు తన శిష్యులతో గెత్సెమనే అనే చోటుకి వెళ్ళాడు. సాతాను వారిని శోధించకుండునట్లు ఆయన వారిని ప్రార్థన చెయ్యమని చెప్పాడు. అప్పుడు యేసు తనకోసం ప్రార్థన చెయ్యడానికి వెళ్ళాడు.
యేసు మూడు సార్లు ప్రార్థన చేసాడు. “నా తండ్రీ సాధ్యమైతే ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించు. అయితే ప్రజల పాపాలు క్షమించబడే మార్గం మరొకటి లేనియెడల నీ చిత్తమే జరుగును గాక.” యేసు యెంతో వేదన చెందాడు, ఆయన చెమట రక్తపు బిందువుల వలే కారింది. యేసుకు పరిచర్య చెయ్యడానికి దేవుడు తన దూతలను పంపాడు.
ప్రార్థన ముగించిన ప్రతీ సారి యేసు తన శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారు నిద్రిస్తుండడం ఆయన చూచాడు. మూడవసారి ఆయన ప్రార్థించిన తరువాత ఆయన శిష్యుల వద్దకు వచ్చి, “లెండి, నన్ను అప్పగించే సమయం ఆసన్నం అయ్యింది.” అని వారితో చెప్పాడు.
ఇస్కరియోతు యూదా మత నాయకులతో అక్కడికి వచ్చాడు, వారితో పాటు ఒక గొప్ప సమూహంకూడా ఉంది. వారు కత్తులతోనూ, బల్లెములతో ఉన్నారు. యూదా యేసు వద్దకు వచ్చి, “బోధకుడా, నీకు శుభం,” అని ఆయనకు ముద్దు పెట్టాడు. యూదానాయకులు యేసును బందించదానికి గుర్తుగా యూదా ఈ పని చేసాడు. అప్పడు యేసు ఇలా చెప్పాడు, “యూదా ఒక ముద్దుతో నీవు నన్ను పట్టిస్తున్నావు.”
సైనికులు యేసును బంధిస్తుండగా పేతురు తన కత్తిని బయటకు తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవిని తెగనరికాడు. యేసు ఇలా చెప్పాడు, “నీ కత్తి తీసి వెయ్యి, నన్ను రక్షించడానికి ఒక సైన్యం కోసం నేను తండ్రిని అడిగియుండేవాడను, అయితే నేను తండ్రికి లోబడవలసి ఉంది.” అప్పుడు యేసు ఆ సైనికుడి చెవిని బాగు చేసాడు. అప్పుడు శిష్యులందరూ పారిపోయారు.